ఎన్నికలే టార్గెట్..! ఆ పార్టీకి ఓట్లు మళ్లితే ప్రాబ్లమ్ అని BRSలో టెన్షన్?

by Disha Web Desk 4 |
ఎన్నికలే టార్గెట్..! ఆ పార్టీకి ఓట్లు మళ్లితే ప్రాబ్లమ్ అని BRSలో టెన్షన్?
X

వచ్చే అసెంబ్లీ ఎన్నికలో ఓట్ల చీలికపై బీఆర్ఎస్ ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో అధికార పార్టీ ఓటు బ్యాంక్ కొద్దిగా చీలినా అది ఏ పార్టీకి మళ్లుతుందనే దానిపై అంచనాకు వస్తున్నది. రూరల్‌లో కాంగ్రెస్ పార్టీకి, అర్బన్‌లో బీజేపీకి బలం పెరగడంతో గులాబీ పార్టీకి గుబులు పట్టుకున్నది. చీలిన ఓట్లతో కాంగ్రెస్ బలపడినా ఇబ్బంది లేదని, ఆ ఓట్లు బీజేపీకి టర్న్ అయితే తమ పార్టీకి చిక్కులు తప్పవని కారు లీడర్ల భావన. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రిపోర్టులు తెప్పించుకున్న గులాబీ బాస్.. తదుపరి వ్యూహాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఎవరి లెక్కలు వారు వేసుకున్నా.. చివరకు ప్రజలు ఎటు వైపు మొగ్గుచూపుతారనేది సస్పెన్స్.

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను రచించడంలో గులాబీ పార్టీ నిమగ్నమైంది. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు గులాబీ బాస్ వివరాలు సేకరిస్తూ ఓ అంచనాకు వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓట్ల చీలకపై ఆయన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉన్నది? ఏయే పార్టీకి ఓట్ల చీలే చాన్స్ ఉన్నదనే వివరాలను ఇప్పటికే ఆయన సేకరించినట్టు సమాచారం. రూరల్ ఏరియాల్లో కాంగ్రెస్, అర్బన్‌లో బీజేపీకి బలం పెరిగిందని ఆ నివేదికల్లో స్పష్టమయినట్టు టాక్.

60 లక్షల సభ్యత్వం కలిగిన అతిపెద్ద ప్రాంతీయ పార్టీ తమదని పేర్కొంటున్న గులాబీ నేతలు.. రాష్ట్రంలో తమకు 50 శాతం ఓటు బ్యాంకు ఉందని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారం చెపడతామని బయటకు చెబుతున్నా.. లోపల వాళ్లకు గుబులు పట్టుకున్నది. కొద్ది మేర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. కానీ ఆ ఓట్లు ఏ పార్టీకి అనుకూలంగా మారతాయో అన్న ఆందోళన బీఆర్ఎస్‌ను వెంటాడుతున్నది. చీలిన ఓట్లతో కాంగ్రెస్ పార్టీ బలపడినా ఫర్వాలేదని, బీజేపీకి మాత్రం అవి టర్న్ కాకూడదని కోరుకుంటున్నారు.

కారులో కమలం గుబులు

రూరల్ ఏరియాల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నదని ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ ఉన్నదని, అర్బన్ ఏరియాల్లో బీఆర్ఎస్ తర్వాత బీజేపీకి ఎక్కువగా ఆదరణ ఉన్నదని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. పెన్షన్ దారులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల్లో బీఆర్ఎస్ పట్ల సానుకూలత ఉన్నది. ప్రభుత్వంపై నిరుద్యోగులతో, పలు సెక్షన్లు వారిలో వ్యతిరేకత ఉన్నా.. అది తమ ఓటు బ్యాంకుపై పెద్దగా ప్రభావం చూపదని ధీమ వ్యక్తం చేస్తున్నాయి. గులాబీ బాస్ నియోజకవర్గాల నుంచి తెప్పించుకన్న రిపోర్టు ఆధారంగా కాంగ్రెస్‌కు రూరల్‌ ఏరియాల్లో 30 నుంచి 35 శాతం ఓటు బ్యాంకు ఉన్నదని.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఓట్లతో ఆ పార్టీ బలయం మరో 2 శాతం పెరిగినా తమకు ఎలాంటి నష్టం ఉండదనే అంచనాకు బీఆర్ఎస్ అధినేత వచ్చినట్టు సమాచారం.

కాంగ్రెస్‌కు ఓటు పర్సంటేజీ పెరిగితే తమకే లాభమనే దీని వల్ల బీజేపీని కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కాస్త బలహీనపడితే ఆ ఓట్లు సైతం బీజేపీకి టర్న్ అయితే కమలం పార్టీకి మరింత బలం చేకూరుతుందనే భయం లోలోపల గులాబీ నేతలను వెంటాడుతున్నది. అందుకే వ్యతిరేకత కాంగ్రెస్‌ బలపడినా ఫర్వాలేదని, బీజేపీకి మాత్రం ఓట్లు టర్న్ కావొద్దని కోరుకుంటున్నారు. ఒక వేళ కాంగ్రెస్ బలపడి ఆ పార్టీ నుంచి ఎక్కువ మంది గెలిచినా.. ఆకర్ష్ పేరుతో వారిని బీఆర్ఎస్‌లోకి చేర్చుకోవచ్చనే అభిప్రాయానికి వచ్చినట్టు టాక్. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయి? ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపుతారు? ఏపార్టీకి చెమటలు పట్టిస్తారు అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Read More: క్వింటాల్‌కు 10 కిలోలు.. తరుగు పేరిట గాయబ్​

Next Story

Most Viewed